భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం
వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. అందుకే మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని అరికట్టడం, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించకోవటం అందరి బాధ్యత.