2020-21 విద్యా సంవత్సరం ఆగష్టుతో పూర్తి...

SS Marvels
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలలో అనిశ్ఛితి నెలకొన్న విషయం తెలిసిందే... విద్యా రంగంలో మరిన్ని వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూనే రాష్ట్రంలో పాఠశాలలను తెరవనున్నట్లు చెప్పారు.
 ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంవత్సరానికి సరిపోయేలా సిలబస్ రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. పాఠశాలల పని దినాలు 180 రోజులు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ నెల 2 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ సెకండియర్ తరగతులు, నవంబర్ 16 నుంచి ఇంటర్ తొలిఏడాది తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులు, డిసెంబర్ 14వ తేదీ నుంచి 1 నుంచి 5 తరగతులు ప్రారంభింస్తామని వివరించారు. నవంబర్ 3 నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలు కూడా తెరుస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్ విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.
‘‘పదో తరగతి పాసైన వారికి సమానంగా ఇంటర్‌ సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేదు. 5.83 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల కోసం అదనంగా 153 కొత్త కళాశాలలకు అనుమతి ఇచ్చాం. రేకుల షెడ్లలో కళాశాలలు నడిపితే చూస్తూ ఊరుకోం. అందుకే గతంలో అనుమతులు రద్దు చేసిన వాటికి మళ్లీ అనుమతులను పునరుద్ధరించలేదు. ఇప్పటివరకు 611 కళాశాలల లైసెన్స్ రద్దు చేశాం. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటిస్తూనే ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాం. ఫీజులు 30 శాతం తగ్గించాలని విద్యాసంస్థలను ఆదేశించాం’’ అని మంత్రి వివరించారు. పాఠశాలల్లో కూడా మాస్కుల ధారణ తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: