జగన్కు అతి పెద్ద ఛాలెంజ్.. నెగ్గుకురాగలడా?
బీజేపీ తమతో కలిసి రావాలని ఇద్దరూ కోరుకుంటున్నా ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ రెండు పార్టీల ముఖ చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన అధినేతల మధ్య సయోధ్య బాగానే ఉంది. కానీ వైసీపీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి అనే ప్రచారం గట్టిగా చేస్తోంది. ఫలితంగా క్యాడర్ లో అయోమయం సృష్టించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
దీనిని అధిగమించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వరుసగా భేటీ అవుతూ జగన్ ను ఓడించడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పై ద్వేషంతో కాపులు వైసీపీకి అండగా నిలిచారు. ఈ సారి మోజార్టీ కాపు యూత్ పవన్ కల్యాణ్ వైపే మొగ్గు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ దాదాపు 90శాతం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది ఆ పార్టీకి అతిపెద్ద సానుకూలాంశం. దాదాపు ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా 60శాతానికి మించి ఓటు బదిలీ జరగదు. కానీ 90శాతం జరుగుతుంది అంటే ఇది వైసీపీపై గట్టిగా ప్రభావం చూపేదే.
అందుకే లేనిపోని గొడవలు సృష్టించి టీడీపీ, జనసేన క్యాడర్ ను గందరగోళంలో పడేయాలని వైసీపీ చూస్తోంది. చంద్రబాబు జైలుల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వెళ్లి అండగా నిలబడటంతో టీడీపీ నాయకులు సైతం జనసేన అధినేతపై సానుకూలంగా ఉన్నారు. ఈ అంశాలు జగన్ పై ప్రభావం చూపేవే. చూద్దాం మరి జగన్ వీటిని ఎలా అధిగమిస్తారో.