ఏపీలో ఆ రెండు కులాల మధ్య యుద్ధం.. ఎటు దారి తీస్తుంది..?
ఇటీవల ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరుగా బాగా నానుతున్న సంగతి తెలిసిందే. జగన్ పార్టీ ద్వారానే ఎంపీగా గెలిచిన ఆయన కొంతకాలంగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విబేధాల నేపథ్యంలో ఆయన్ను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం.. ఆయన పాదాలకు గాయాలు కావడం.. విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరింతగా డోసు పెంచారు.
ఈ లోపు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు తొలగింపు విషయంలో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా అశోక్ గజపతిరాజునే కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అశోక్ గజపతిపై విమర్శల డోసు పెంచారు. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా అశోక్ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఏకంగా జైలుకు పంపుతామని కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రాజుకుంది. తెలుగు రాష్ట్రాల క్షత్రియ సమాజం పేరుతో విజయసాయి వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.
ఈ మొత్తం వ్యవహారంతో ఇప్పుడు ఏపీలో రెడ్డి, రాజు కులాల మధ్య ఘర్షణ వైఖరి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇది కేవలం అశోక్, రఘురామ కృష్ణం రాజుల వరకే పరిమితం అవుతుందని.. రాజు సామాజిక వర్గం వారంతా ఈ పరిణామాలపై ఆగ్రహం లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.