ఏపీ: జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న యనమల!
ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు మాట్లాడుతూ, "ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు బాబుగారు మొండిచేయి చూపారు. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చి పట్టం గట్టారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని దారుణంగా మోసం చేసారు. టీడీపీలో గత 42 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కనీసం నామీద వారికి జాలి లేదు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే చక్కటి ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. కానీ నాకు వారు ఆ అవకాశం ఇవ్వలేదు. దోపిడీ దారులకు, పెత్తం దారులకు సీట్లు ఇచ్చుకున్నారు. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు ఉన్న పాపాన లేదు" అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... "నా జీవితంలో గత 42 సంవత్సరాలగా ప్రజల మధ్యనే ఉన్నాను. ఎవరేంటో నాకు తెలుసు. గత ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి చాలా ఆనందమేసింది. అందుకే వైఎస్సార్సీపీలో చేరా. అభివృద్ధి వీరితోనే సాధ్య పడుతుంది. సీఎం వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నా శక్తి ఉన్నంతవరకు పటు పడతా. అదే విధంగా కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు నా వంతుగా కృషి చేస్తా" అని ఈ సందర్భంగా యనమల కృష్ణుడు తెలిపారు.