హెరాల్డ్ ఎడిటోరియల్ : కొత్త కమిటిలపై నేతల్లో అప్పుడే అసంతృప్తా ?
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ప్రతిభాభారతి టీడీపీని వదిలేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. అలాంటి ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇక చిత్తూరు మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ కూడా ఏదో రోజు పార్టీని వదిలిపెట్టడం ఖాయమని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎలాగంటే ఈమధ్య తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినపుడు సత్యప్రభ కొడుకు డీకే శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. దాంతో డీకే కుటుంబం టీడీపీని వదిలేయటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తనకు పార్టీలో ఏ పదవులు వద్దని పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి ఈమధ్యనే రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు జాతీయ ఉపాద్యక్షురాలిగా మళ్ళీ అరుణకుమారిని ఎందుకు నియమించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. వయోభారం కారణంగా తనకు పదవులు వద్దని ఆమె తన రాజీనామా లేఖలో స్పష్టంగా చెప్పారు.
ఇక గుంటూరు ఎంపి, లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్, అరుణకుమారి కొడుకు అయిన గల్లా జయదేవ్ ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. విచిత్రమేమిటంటే జయదేవ్ ఇప్పటికే లోక్ సభలో ఫ్లోర్ లీడర్ హోదాలో పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉండటం. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్న కోట్ల సూర్యప్రకాషరెడ్డి లాంటి వాళ్ళను కూడా ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించన మాజీ ఉపముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. కేఇ కుటుంబం కూడా వైసీపీలో చేరిపోవటం ఖాయమని ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విశాఖ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణకు కూడా ఏ కమిటిలోను చోటు దక్కలేదు.