అరాచకం సృష్టించిన ఆ 'రహస్య' రసాయనం ఏంటి?
వందల మంది కార్మికులను అస్వస్థత బారిన పడేసిన ఆ రసాయనం ఏంటి? ఆ రసాయనం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. దీంతో ఇది కాలుష్య నియంత్రణ మండలి వైఫల్యమేనని కొందరు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. అసలు ఏ వాయువు విడుదలైంతో తెలియకుండానే... సరైన విచారణ జరపకుండానే పోరస్ పరిశ్రమ నుంచి వెలువడిన అమ్మోనియాయే కారణమని ఒకసారి ప్రకటించారు. ఆ తర్వాత అది కాదు.. క్లోరిన్ కారణమని మరోసారి ప్రకటించారు.
ఇలా పీసీబీ ఎలా చెబుతుందని సైంటిస్టులు డా.కె.బాబురావు, డా.కె.వెంకటరెడ్డి, డా.సీహెచ్.వెంకటేశ్వర్లు, డా.ఎం.బాపూజీ సంయుక్తంగా పీసీబీ ఛైర్మన్ ఏకే పరీడాకు బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్న నిపుణుల వివరాలేంటో కూడా ప్రజలకు ఇప్పటి వరకూ తెలియ పరచలేదని.. వీరు అంటున్నారు. అసలు అవన్నీ ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నిస్తున్నారు.
సీడ్స్ వస్త్ర పరిశ్రమలోకానీ.. బ్రాండిక్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలోనూ ప్రమాదం జరిగిన వెంటనే వాయు నాణ్యతను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నిస్తున్నారు. వస్త్ర పరిశ్రమల్లో వేల రకాల రసాయనాలు వినియోగిస్తారని.. అవి గాలిలో కలిసి అస్వస్థతకు కారణమయ్యే అవకాశం ఉందని.. ఆ కోణంలో విచారణ జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను ఎందుకు విస్మ రిస్తున్నారని.. సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. వెంటే సీడ్స్లో వాయు నాణ్యత పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయాలి ప్రజల తరపున సైంటిస్టులు డిమాండ్ చేస్తున్నారు.