ఈ ఎం.పి. మామూలోడు కాదు
భారత దేశంలో నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతలకు కొదువ లేదు. చట్ట సభలలో వీరి సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉంది. ఇది బాధాకరమైన విషయం అయినా తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. నేరం రుజువై, శిక్షపడిన తరువాతనే అతను ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని రాజ్యాంగం చెబుతోంది. కేసులు నమోదైన వారు, క్రింది స్థాయి నుంచి పై కోర్టు వరకూ అప్పీలు చేసుకుంటూ వెళుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే దక్షిణ భారత్ దేశం లోని ఓ పార్లమెంట్ సభ్యుడి పై మర్డర్ కేసు నమోదైంది. తమిళనాడు రాష్ట్రం కడలూరు పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టి.ఆర్. వి. రమేష్ పై ఆ రాష్ట్ర పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. ఆయన ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కే సభ్యుడు కూడా కావడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. నిందితుడు రమేష్ కు పన్రుతి ప్రాంతంలో జీడిప్పు ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అది అతని వ్యాపారాలలో ముఖ్యమైన వ్యాపారం. ఇందులో అరవై మూడు సంవత్సరాల జి. గోవింద రాజు ఓ ఉద్యోగి. అతను అనుమానాస్పద స్థితిలో సెప్టంబర్ 19న మృతి చెందాడు. అంతకు ముందే జీడిపప్పు కర్మాగారంలో పనికి వెళ్లిన తన తండ్రి తిరిగి ఇంటికి రాలేదని మృతుని కుమారుడు, ట్రక్కు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న సెంథివేల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత సెంథివేల్ చెన్నై కు వెళ్లారు. జి. గోవింద రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని , ఆసుపత్రికి తరలించామని కర్మాగారం సిబ్బంది నుంచి సెంథివేల్ కు ఫోన్ సెప్టెంబర్ 20 వతేదీ పోన్ చేశారు.. సెంథి వేల్ కుటుంబ సభ్యులు గోవింద రాజు ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ, అప్పటికే గోవింద రాజు విగతజీవుడై పడి ఉన్నారు. అతని శరీరం పైగాయాలు ఉన్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సెంథివేల్ కు తెలిపారు. దీంతో సెంథివేల్ చెన్నై నుంచి తిరిగి వచ్చి తన తండ్రి ఆత్మహత్య చేసుకో లేదని, హత్యకు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడలూరు పార్లమెంట్ సభ్యుడు రమేష్ , అతని అనుచరులు తన తండ్రిని హత్య చేశారని తన ఫిర్యాదు పేర్కోన్నారు. ఈ కేసు స్థానికంగా ప్రకంపనలు సృష్టించింది. స్థానికులంతా ఒక్కటై న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి స్థాలిన్ కేసును సి.ఐ.డి విభాగానికి బదిలీ చేశారు. సిబి-సిఐడి పోలీసులుకేసు దర్యాప్తు చేసి పార్లమెంట్ సభ్యుడు రమేష్, అతని అనుచరులు ఐదుగురి పై ఐ.పి.సి సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేసేందకు అతని గృహానికి వెళ్లగా, అతను అక్కడ లేరు. ఎం.పి ఇంటిలో ఉన్న రమేష్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తమిళనాడులో సంచలనం కలిగించింది.