పేటిఎం.. భారత్లో ఎక్కువమందికి అందుబాటులో ఉన్న డిజిటల్ వాలెట్. ఇప్పుడు పేటీఎం అంటే తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే డిమానిటైజేషన్ సమయంలో పేటీఎం అంతగా జనాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఒకప్పుడు పేటీఎం అంటే ఏమిటి అని అడిగిన జనమే ఇప్పుడు ప్రతి షాపులో పేటీఎంను ఉపయోగిస్తున్నారు.
ప్రతి మొబైల్లో తప్పనిసరిగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే పేటీఎం ఇప్పుడు మరో ఆప్షన్తో ముందుకొచ్చింది. తమ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలుగా పేటీఎం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఓ డెబిట్ లేదా ఏటీఎం కార్డును అందజేయనుంది. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా విస్తరించనున్నట్లు పేటీఎం తెలిపింది.
ఇక పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్లందరూ ఈ కార్డును పొందవచ్చు. ఇందుకోసం రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం యాప్లో బ్యాంక్ సెక్షన్ ఓపెన్ చేసి, డెబిట్ కార్డు సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత డెలివరీ అడ్రస్ను ఎంపిక చేసుకుని ఏటీఎంను రిక్వెస్ట్ చేసుకోవచ్చు.