ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు అనేక విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆ సంస్థలు ఈ వార్త విని షాక్ అయ్యాయి. ఇటీవల ఢిల్లీలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో కలిసి చర్చలు జరిపామని గుర్తు చేసుకున్నాయి. ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంతాపం తెలిపింది. వారం క్రితమే ఏపీలో పెట్టుబడుల గురించి మంత్రి మేకపాటి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేసుకుంది. మేకపాటి మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తామని మరో సంస్థ రీజెన్సీ గ్రూపు తెలిపింది.
ఇటీవల దుబాయ్ వచ్చినప్పుడు మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని మరో సంస్థ షరాఫ్ గ్రూపు తెలిపింది. వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని ఆ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ అన్నారు. అలాగే జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ కూడా మేకపాటి కుటుంబానికి సంతాపం తెలిపాయి.