పార్టీ పెడతానంటే కేసీఆర్ను ఎవరైనా వద్దన్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరన్నా వద్దన్నారా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని, అది వారి హక్కన్నారు. ఏపీలో కరెంటు కోతలున్నాయని కేసీఆర్ చెబుతున్నారని, తెలంగాణ శ్రీశైలంలోని మిగులు నీటిని వాడుకోవడంవల్లే ఆ రాష్ట్రానికి మిగులు కరెంటు వచ్చిందని, ఇక్కడ కోతలు వచ్చాయన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడంవల్ల ఏపీ నష్టపోతుందని ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే నిజమవుతోందని, విద్యుత్తు కొరత, నీటి కొరత ఎదురవుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోకుండా ఉంటే ఇప్పుడు దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో నిలిచేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని భారతీయ జనతాపార్టీ నిలువునా మోసం చేసిందని సజ్జల ఆరోపించారు. ఈరోజు వరకు ఆ పార్టీ హోదా గురించి మాట్లాడటంలేదని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్లు చేస్తున్న ఆందోళనల వెనక తెలుగుదేశం పార్టీ ఉందని, ప్రభుత్వ పోస్టులను సరెండర్ చేసి యాజమాన్యాలు వాటి స్కూళ్లను వారు నడుపుకోవచ్చన్నారు.