అన్నవరం స్వామికి కూడా కరోనా దెబ్బ?
కరోనా అందరినీ కాటేస్తోంది. భగవంతుడు ఇందుకు అతీతమేమో అనుకుంటే ఆయన్ని కూడా అది వదలడంలేదు. అన్నవరం శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామివారి దేవాలయంలో విక్రయిస్తున్న బంగీ ప్రసాదం ధరను దేవస్థానం పెంచింది. ఇప్పటివరకు 100 గ్రాముల బంగీ ప్రసాదం రూ.15 ఉండగా ఇకనుంచి రూ.20 చేశారు. రవాణా ఛార్జీలు పెరగడం, సరకుల ధరలు పెరగడంలాంటి కారణాలతో ప్రసాదం ధరను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రూ.200 టికెట్తో అంతరాలయం దర్శనం చేసుకునే భక్తులకు ఇప్పటివరకు 150 గ్రాముల బంగీ ప్రసాదాన్ని ఉచితంగా ఇచ్చేవారు. ఇకనుంచి అంతే బరువున్న గోధుమ నూక ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేవుడి దగ్గరకు భక్తులు వస్తారు కాబట్టి ధరలు పెరిగినా, తగ్గినా స్వామిమీద భక్తితో, నమ్మకంతో ప్రసాదం కొనుగోలు చేసుకొని బంధువులు, స్నేహితులందరికీ పంచుతారు. ఆనందపడతారు. ఇటువంటి చిన్నపాటి ఆనందాలను కూడా భక్తులకు దూరం చేయాలని అన్నవరం దేవస్థానం భావించడం తగదేమోనంటున్నారు. ఎందుకంటే బంగీప్రసాదం దొరకడమే గగనం. చాలా తక్కువస్థాయిలో ఉత్పత్తి చేస్తారు. అది కూడా ఇప్పుడు ధర పెంచేయడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.