వివేకా హత్యకు వాడిన ఆయుధాలు దొరికాయా?
మాజీ మంత్రి డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాలకు సంబంధించి సీబీఐ తన విచారణ కొనసాగిస్తోంది. కొవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులకు శనివారం 103వ రోజు విచారణ. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. ఈరోజు కడప జిల్లా జమాలపల్లికి చెందిన విజయ్శంకర్రెడ్డిని పిలిపించారు. ఇతను సీబీఐ విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. అలాగే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్రెడ్డిని కూడా అధికారులు విచారిస్తున్నారు. హత్యకు వాడిన ఆయుధాలేంటి? వాటిని ఎక్కడ వదిలేశారు? ఎవరెవరు పాల్గొన్నారు? అనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యాయుధాలు పులివెందులలోని ఓ కాల్వలో పారేశారనే సమాచారంతో నెలరోజుల క్రితం అక్కడ తవ్వకాలు జరిపించారు. అయితే ఆయుధాలు దొరకకపోవడంతో ఉమాశంకర్రెడ్డికి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్న సీబీఐ వివిధ కోణాల్లో దర్యాప్తును సాగిస్తోంది.