వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణకు తిరుగులేని రికార్డు..!
వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణకు తిరుగులేని రికార్డు సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ కింద తెలంగాణ ఇచ్చిందని, గతంలో 20, 30 లక్షలు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. ఇంతవరకు ఇండియాలో ఏ స్టేట్ కూడా నూటికి నూరు శాతం వరి కొనలేదని, కేవలం తెలంగాణలోనే కొన్నామని ఆయన అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కొన్ని ప్రత్యేకమైన నేలలు తెలంగాణలో ఉన్నాయని, అందుకే హైదరాబాద్లో ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, ఇక్కడ అద్భుతంగా పంటలు సాగు అవుతున్నాయని, అద్భుతమైన నైపుణ్యం ఉన్న రైతులు ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
కేబినెట్ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. అధికారులతో మాట్లాడి వ్యూహరచన చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ప్రస్తుతం1,452 కుటుంబాలు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీస్ పహారా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించింది. కరోనాతో జీవించడం నేర్చుకోవాలి. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలి. హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని' సీఎం పేర్కొన్నారు.