ఆ జిల్లాకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పడుతోంది. కేవలం హైదరాబాద్లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఆ తర్వాత ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైంది కరోనా.. తాజాగా.. ఈరోజు జగిత్యాల జిల్లాలో కూడా ఒక వృద్ధుడికి కరోనా సోకింది. చాలా జిల్లాల్లో వైరస్ ప్రభావం లేనేలేదు.. ఈ జాబితాలో పాలమూరు జిల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాలమూరు జిల్లాలో గత 27 రోజుల నుంచి ఒక్క కొవిడ్19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ జిల్లా మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
నేటి నుంచి జిల్లాలో ఉన్న కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తున్నామని మంత్రి ప్రకటించారు. కరోనా కేసుల నివారణకు ఎంతగానో శ్రమించిన జిల్లా యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వచ్చిన వారు తప్పకుండా పోలీసులకు సమాచారం అందించి, 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కూలీలు ఎక్కడి వారు అక్కడే పని చేసుకోవాలని... ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.