కరోనా పై యుద్ధం: తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క జిల్లాకే దక్కిన చోటు
భారత్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు చాలా వరకు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. రోజురోజుకూ వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాప్త చెందుతున్నా.. పాత ప్రాంతాల్లో కట్టడి అవుతోంది. తొలుత కరోనా పాజిటివ్ కేసులు బయటపడిన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలను కంటైన్మెంట్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విషయాన్ని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం చెప్పారు. ఆ 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. ఆయా జిల్లాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యల వల్లే కరోనా కట్టడి సాధ్యమైందని ఆయనపేర్కొన్నారు. ఈ ఘనత అధికారులకే దక్కుతుందని అన్నారు.
అయితే.. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క జిల్లాకే దక్కింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆయా జిల్లాల్లో భవిష్యత్తులోనూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పటిష్టమైన ప్రభుత్వాలు, అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. భారత్లో ఇప్పటివరకు ఈ సంఖ్య ఏకంగా 11వేలకు చేరువలో ఉంది. కోవిడ్ -19 కేసుల సంఖ్య 10,453కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 358కు చేరుకుంది. ఇక సుమారు 980మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. 8048పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే.. దేశ వ్యాప్తంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.