బిగ్ బ్రేకింగ్: 100మంది వైద్యులు బలి
ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స చేస్తున్న క్రమంలో వైద్యులకు కూడా కరోనా సోకుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక ఇటలీలో అయితే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ దేశంలో కనీస రక్షణ చర్యలు లేకుండా కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తుండగా వందలమంది డాక్టర్లకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 100మందికిపైగా కరోనా కాటుకు బలి అయ్యారు. ఇందులో కరోనా పేషెంట్లకు వైద్య సహాయం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పలువురు ప్రభుత్వ మాజీ వైద్యులు కూడా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థల సంఘం వెల్లడించింది. ఇటలీ దేశవ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందిలో పది శాతం మందికి కరోనా సోకి ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.
ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోమనడం దారుణమని, వైద్యుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోందని సంఘం అధ్యక్షుడు ఫిలిప్పో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటలీ కరోనా కాటుకు ఇప్పటివరకు కొన్నివేలమంది మరణించారు. ఈ సంఖ్య ముందుముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇక భారత్లో కూడా కరోనా పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో పలువురు డాక్టర్లు, నర్సులు కరోనా బారినపడ్డారు. ప్రధానంగా ఢిల్లీలో, ముంబైలో ఎక్కువగా డాక్టర్లు కరోనా బారినపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్లో కూడా డాక్టర్ దంపతులతోపాటు మరో నలుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైద్యులు సామాజికంగా కూడా కొంత వివక్షను ఎదుర్కొంటున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను చూస్తేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.