బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మొదలైంది. ఇక్కడ బరిలో వైసీపీ, బీజేపీ మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఉంది. అయితే నామమాత్రపు పోటీకి మాత్రమే ఆ జాతీయ పార్టీ పరిమితమైంది. వాస్తవానికి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నిక కనుక పెద్దగా హడావుడి పడాల్సిన పని లేకున్నా వైసీపీ మాత్రం మెజార్టీ కోసమే రాజకీయం చేయడం ఓ ఆశ్చర్యకర పరిణామం. ఇక్కడి దాసరి ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య హఠాన్మరణంతో జరుగుతున్న పోలింగ్ కనుక దీనికి పెద్ద రాద్ధాంతం అవసరం లేదు. అయినా కూడా బరిలో ఉన్న దాసరి సుధ గెలుపు కన్నా మెజార్టీనే ముఖ్యం అన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రులను మోహరించి మరీ రాజకీయం నడిపారు. ఇప్పుడు పోలింగ్ వేళ సోము వీర్రాజు (బీజేపీ లీడర్) రాజకీయం రక్తి కట్టించేందుకు తెగ ఆరాట పడుతున్నారు. ఇక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుపై కడప ఎస్పీ కి మీడియా ముఖంగా కంప్లైంట్ చేశారు. గోపవరం మండలం, బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీజేపీ నేతలపై అధికార పార్టీ ఆగడాలు సాగిస్తుందని మండిపడుతూ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వీటిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. అదేవిధంగా తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రంకు సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ భద్రతా వ్యవస్థ సరిగా లేదని మండి పడుతున్నారు. మరి! వీటిపై కడప ఎస్పీ ఏ విధంగా స్పందిస్తారో అన్నది కీలకం.