'సాక్షి'లో రాసిన వార్త వేరుగా ఉందే..?
ఏపీలో నిన్న ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలతోపాటు ఆ పార్టీ నేతలపై దాడులు జరిగాయి. అయితే సాక్షి దినపత్రికలో దీన్ని గురించి ఒక విశ్లేషణ రాశారు. చంద్రబాబునాయుడు తన గూండాలచేత ముందుగానే ప్రణాళిక రచించుకొని శాంతిభద్రతలను భగ్నం చేయడానికి కుట్రపన్నారని రాశారు. ముందుగానే తన పార్టీకి చెందిన నేతలు పట్టాభి, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్బాబులాంటివారిచేత వైసీపీ ప్రభుత్వంపై, పార్టీపై బూతుపురాణం రచించారన్నారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించేందుకు తెలుగుదేశం గూండాలు ప్రయత్నించగా అప్రమత్తమైన వైసీపీ నేతలు, పోలీసులు అడ్డుకున్నారని వార్త రాసింది. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు దశలవారీగా పన్నాగాన్ని పన్నారని, చడీచప్పుడు లేకుండా ఉండవల్లి వచ్చి పథకాన్ని రచంచి అమలు చేశారని రాశారు. సాక్షి పత్రికలో రాసిన కథనాన్ని బట్టి నిన్న జరిగిన అల్లర్లన్నీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు చేయించారని తెలుస్తోంది. వాస్తవమేంటో ప్రజలకైతే బోధపడలేదు.