గంటలు గడుస్తున్నాయి. రోజులు మారిపోతున్నాయి. ఐనా విక్రమ్ నుంచి ఉలుకు పలుకు లేదు. ఏం చేసినా.. మరో వారం రోజులే. ఆ తర్వాత అంతా చీకటే. ఈ లోపే ల్యాండర్ జాడ కనుక్కోవాలి. లేదంటే 14 రోజులు ఆగాల్సిందే. దీంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇస్రో. ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఇటు నాసా సాయం కోరింది.
ల్యాండర్ విక్రమ్తో సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇస్రో. మరో 8 రోజుల్లో చంద్రుడి దక్షిణధృవం చీకటిమయంగా మారనుంది. ఆ తర్వాత విక్రమ్ సోలార్ ప్యానెళ్లను ఓపెన్ చేయడం చాలా కష్టం. దీంతో ఈలోపే ల్యాండర్ను గుర్తించి ట్రేస్ చేయాలనే పట్టుదలతో ఉంది. డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా రేడియో తరంగాలను పంపిస్తోంది.
ఇటు నాసా కూడా రంగంలోకి దిగింది. రెండు రోజులుగా డీప్ స్పేస్ నెట్వర్క్ కేంద్రాల ద్వారా నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ చంద్రుడిపైకి సిగ్నల్స్ పంపిస్తోంది. విక్రమ్ ల్యాండర్ను ఉత్తేజపర్చేందుకు శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్వీని పంపించింది. ఎర్త్ మూన్ ఎర్త్ మీదుగా 2103.7 మెగాహెడ్జిల సిగ్నల్ చంద్రుడిపై పడి తిరిగి భూమికి చేరిందంటూ నాసా శాస్త్రవేత్త ట్వీట్ చేశారు.
ఐనప్పటి వరకూ విక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆర్బిటార్ కక్ష తగ్గించి..ట్రేస్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్బిటార్లో ఉన్న అత్యాధునిక, హైరెజల్యూషన్ కెమరాలతో ఫొటోలు తీసి.. ఎక్కడుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఐతే.. అది అంత ఈజీ కాదు. కక్ష తగ్గిస్తే... ఆర్బిటార్ జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.