టీమ్ ఇండియా'కు ఇక భయం లేదు.. రాబోయే పదేళ్లకు ఓపెనర్ దొరికేసాడు..?
ఇక ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మరోసారి పృథ్వీ షా కు అవకాశం వచ్చినప్పటికీ తొలి టెస్టులో.. ఒక్క రన్ కూడా చేయకుండానే వికెట్లు కోల్పోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో వెంటనే పృథ్వీ షా పై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం శుబ్ మన్ గిల్ కి అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శుబ్ మన్ గిల్ గబ్బా లో జరిగిన చివరి టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 91 పరుగులు చేశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఎంతో అనుభవం గల ఆస్ట్రేలియా బౌలర్లని అతను ఎదుర్కొన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో ఇక టెస్ట్ క్రికెట్ లో భారత ఓపెనర్ గా శుబ్ మన్ గిల్ కి తిరుగు లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ టీమిండియా ఓపెనింగ్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ దగ్గర అన్ని రకాల షాట్స్ ఆడే ప్రతిభ ఉందని ఆస్ట్రేలియా బౌలర్లు టెస్టు సిరీస్లో షార్ట్ పిచ్ బంతులను పదేపదే వేస్తున్నప్పటికీ అతను అలవోకగా ఎదుర్కున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. రాబోయే పదేళ్లలో టీమిండియాకు అసలు సిసలైన ఓపెనర్ దొరికేసాడు అంటూ చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా'కు ఓపెనింగ్ భయం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.