ఐసీసీ టెస్టు, వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం టీమిండియా సారథి విరాట్ కోహ్లి నెంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతున్నాడని తెలిసిందే. ఇక పొట్టి ఫార్మట్ కు వచ్చే సరికి కోహ్లి ర్యాంక్ ప్రస్తుతం 10కి చేరింది. అయితే టీ 20ల్లో ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ మొదటి స్థానం లో ఉండొచ్చు కానీ కోహ్లి కూడా నెంబర్ 1 ఆటగాడే అని అనకుండా ఉండలేం అదెలా అనుకుంటున్నారా.. వన్డే , టెస్టులకు విరామం ఇవ్వని కోహ్లి టీ 20లకు మాత్రం అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తాడు. దాంతో ఆ ఫార్మట్ లో కూడా అతను నెంబర్ 1 ర్యాంక్ లో లేకపోవడానికి ఇదో కారణం.
ఇదిలా ఉంటే అప్పుడప్పుడు విరామం ఇచ్చిన కూడా కోహ్లి అంతర్జాతీయ టీ 20 ల్లో 12 మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొని ఇప్పటివరకు టీ 20లో అత్యధిక మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో అఫ్ఘానిస్తాన్ అల్ రౌండర్ మహమ్మద్ నబి తో కలిసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లను వదిలేసి మ్యాన్ అఫ్ ది సిరీస్ విషయానికి వస్తే ఇందులో అయితే కోహ్లి దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ లేడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో కోహ్లి మ్యాన్ అఫ్ ది సిరీస్ గా ఎంపికైయ్యాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 6వ సారి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు మరే క్రికెటర్ కనీసం నాలుగు సార్లు కూడా ఈ అవార్డును గెలుచుకోలేకపోయాడు. ఆరకంగా చూస్తే కోహ్లి పొట్టి ఫార్మాట్ లో కూడా నెంబర్ 1 ఆటగాడే కదా. ఇక ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 20 సార్లు మ్యాన్ అఫ్ ది సిరీస్ లు గెలుచుకోగా 17 సార్లు ఈ అవార్డును గెలుచుకొని కోహ్లి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.