భగవంతుని అనుగ్రహం సులభం ఈ తొమ్మిది విధానాలలో, ఏదైనా ఒక్కదాంతో!
శ్రవణం - దేవుని గురించి వినుట ద్వారా ఆయన నామాలని, మహిమలను, గుణగణాలను తెలుసుకోవటం.
కీర్తనం - అన్నమయ్యవలె, త్యాగయ్యవలె - దేవుని కీర్తి - ఆయన మహత్యాలను ఔన్నత్యాలను గానం చేయటం.
దైవస్మరణ - నారదునివలె నిరంతరం నామం స్మరించుట ద్వారా ఆయన లీలలను మహిమలను గుణగణాలను, అపారకరుణా స్వరూప్పాన్ని పదే పదే అంటే సర్వదా స్మరణకు తెచ్చుకోవటం.
పాదసేవ - గరుడునివలె స్వామి సేవచేయటం ద్వారా సౌభాగ్యాన్ని ఇచ్చే ఆయన పాదపద్మాలను సదా పూజించటం.
అర్చన - ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం, దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పదహారు చర్యలతో అర్చించటం అంటే షోడ్రషోపచార పూజలు పుష్పాలు కుంకుమ అక్షతలతో పూజించటం.
వందనం- త్రికరణ (మనసు, వాక్కు, శరీరం) శుద్ది గా నమస్కరించటం అంటే శిరస్సు వంచి నమస్కరించటం అంతకంటే సాష్టాంగ ప్రణామం చేయటం.
దాస్యం - హనుమంతునివలె దాస్యం చేయటం అంటే భగవానునికి అతి సన్నిహితంగా ఉండటం భక్తునికి భగవతునికి అభేధంగా ఉండటం.
సఖ్యం – గోపికలవలె, అర్జునినివలె, దేవుని తమ సఖునిగా భావించి తనపై భారం వేయటం ద్వారా ఆ భగవానునితో స్నేహం చేయటం మైత్రి నిర్వహించి ఒక ప్రన స్నేహితునిలా మెలగటం.
ఆత్మనివేదనం - ఆత్మ (తనను తాను) భగవంతునికి అర్పించి స్వామి సంకల్పంపై కర్మలు చేయటం ద్వారా మనిషి అహంకారాన్ని విడిచి, సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమాత్మ నే కీర్తించటం.
“శ్రవణం కీర్తనం విష్నోః/స్మరణం పాదసేవనం/అర్చనం వందనం దాస్యం/ సఖ్యమాత్మ నివేదనం”
నిష్ట నియమాలకన్నా, నిర్మలాంతఃకరణ అనేది ప్రధానం. ఆదే ముక్తికి సోఫానం. నవ విధ భక్తి మార్గాలను పాటించే దాసులలో అగ్రగణ్యుడైన శ్రీ ఆంజనేయుడు - భక్తులలో అగ్రగణ్యులైన అన్నమయ్య, త్యాగయ్య, పోతన, రామదాసు, చైతన్య మహాప్రభువు భక్తి మార్గాలను భిన్న విధాలుగా అద్యయనం చేసి, పరమాత్ముని ఆరాధనతో ఆ సన్నిది చేరుకున్నారు.