సెటైర్: మోడీకి లెటర్ ఎందుకు.. కేసీఆర్‌కు ఫోన్‌ చేయొచ్చుగా..!

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం తారాస్థాయికి చేరుతోంది. అయితే.. గతంలో రెండు రాష్ట్రాల నేతలు చర్చించుకునేందుకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే.. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉండేవారు. వారిద్దరికీ పడదన్న విషయం తెలిసిందే. కానీ.. ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ మధ్య చాలా సఖ్యత ఉంది. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. ఇద్దరూ గతంలో ఎన్నోసార్లు తమ ప్రేమను ప్రకటించుకున్నారు. ఆ ప్రేమను  ప్రదర్శించుకున్నారు కూడా.

కానీ.. ఎక్కడ చెండిందో ఏమో కానీ.. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. దీంతో కేసీఆర్.. పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్లు కిందకు వదిలేస్తున్నారు. అయితే.. ఇంత గొడవ జరుగుతుంటే..  ఈ కేసీఆర్, జగన్ మాత్రం నేరుగా దీనిపై చర్చించుకోవడం  లేదు. దీన్ని కొందరు విమర్శిస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిన జగన్‌ రెడ్డి, తాను అగ్రజుడిగా భావిస్తున్న కేసీఆర్‌కు మాత్రం ఫోన్‌ చేసే సాహసం చేయలేదని ఆంధ్రజ్యోతి ఆర్కే తప్పుబడుతున్నారు.

తాను సంయమనం కోల్పోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఏమవుతుందోనని ఇప్పుడు ఆందోళన పడుతున్న జగన్‌ రెడ్డి, 2016లో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదని ఆర్కే గుర్తు చేస్తున్నారు. అప్పుడు జగన్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివసించేవారని... అప్పటికి తాడేపల్లికి మకాం మార్చలేదని ఆర్కే గుర్తు చేశారు. అయినా తాము చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన జగన్‌ రెడ్డికి నష్టం చేయడానికి తెలంగాణవాదులు ప్రయత్నించిందేమీ లేదన్నారు ఆర్కే.

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండిగా వ్యవహరిస్తున్నదా అనే విషయం చెప్పలేమంటున్న ఆర్కే..  రాయలసీమకు నీటిని తరలించడం కోసమే ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నదా అనేదీ చెప్పడం కష్టమంటున్నారు. అందుకే కేసీఆర్, జగన్ కూర్చుని వివాదం పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. మరి జగన్ కేసీఆర్‌కు ఫోన్ చేస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: