ఆ విషయంలో జగన్‌ కంటే చంద్రబాబే బెటరా..?

Chakravarthi Kalyan
ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత అవశేషాంధ్ర ప్రదేశ్‌కు మొదటి సీఎంగా చంద్రబాబు పని చేశారు. పేరుకు విడిపోయింది తెలంగాణ అయినా.. వాస్తవానికి విడిపోయింది ఆంధ్రప్రదేశే.. రాజధాని లేకపోవడం ఓ ప్రధాన సమస్యగా మారింది. కల్పతరువులాంటి హైదరాబాద్ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో సీఎంగా ఉన్న చంద్రబాబు.. అంత కష్ట కాలంలోనూ ఉద్యోగులకు బ్రహ్మాండమైన పీఆర్సీ ఇచ్చానని చెప్పుకుంటున్నారు.

తాజాగా జగన్ సర్కారు ఉద్యోగులకు 23 శాతం మాత్రమే ఫిట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇది మధ్యంతర భృతి 27 కంటే కూడా తక్కువ. ఇలా ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటి సారి. కరోనా కారణంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి.. ఇవ్వాలని ఉన్నా.. ఇవ్వలేకపోతున్నామని సీఎం జగన్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్న చంద్రబాబు.. జగనూ.. నీ కంటే నేనే బెటర్ కదయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా తన హాయంలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లోనూ జగన్ కోత పెట్టారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారని చంద్రబాబు అంటున్నారు. కరోనా పేరు చెప్పి ఏ రాష్ట్రం కూడా వేతనాల్లో కూడా కోతలు పెట్టలేదని.. కేవలం ఏపీలోనే అలా జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలంటున్న చంద్రబాబు.. కరెంటు కోతలు అరికట్టాలి, విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. డిస్కంల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. రాజధాని అమరావతికి చెందిన భూములు తాకట్టు పెడుతున్నారన్న అంశంపై స్పందించిన చంద్రబాబు.. హైకోర్టు తీర్పు రిజర్వులో ఉండగా రాజధాని భూముల తనఖా సరికాదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మొత్తానికి జగన్ పాలన కంటే తన పాలనే బెటర్ అని చంద్రబాబు ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: