అమెరికాలో ఘోరం..మతం అడిగి మరీ..!!
అగ్ర రాజ్యమైన అమెరికాలో నేర సామ్రాజ్యం రోజు రోజుకూ విస్తరిస్తుంది.. అక్రమ ఆయుధాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడు రెచ్చిపోతారో తెలియని భయాందోళన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు బతుకుతున్నారు. అప్పుడప్పుడు ఉన్మాదులుగామారి కొంత మంది చర్చీల్లో, కళాశాలల్లో పిచ్చిగా రెచ్చిపోయి మరీ కాల్పులకు తెగబడుతున్నారు. దీనిపై అక్కడి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మారణకాండ ఆగడం లేదు.
తాజాగా అమెరికాలోని ఒరెగన్ స్టేట్ ఉంప్క్వా కళాశాలలో ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా, 20మందికి పైగా గాయాలయ్యాయి.తరగతి గదిలో ఉన్న ప్రొఫెసర్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చినట్లు పేర్కొన్నారు. క్రైస్తవ విద్యార్థులు లేచి నిలబడండి అని హెచ్చరిస్తూ కాల్పులు జరిపాడని, హ్యాండ్ గన్ను రీలోడ్ చేసుకుంటూ తరగతి గదులు తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని గాయపడిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచార మందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని కాల్పులకు పాల్పడిన ఉన్మాదిని హతమార్చారు.
రోదనలతో నిండిపోయిన సంఘటన స్థలం..
దుండగుడు చిరిస్ హార్పర్ మెర్సెర్ (26) గా పోలీసులు గుర్తించారు. అతను వించిస్టర్ ఒరెగాన్ లో ఒక అపార్ట్ మెంటులో తన తల్లితో కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి అతని ఇంటిని కూడా సోదా చేశారు. అతను ఇంటర్ నెట్ లో ‘మై స్పేస్’ అనే బ్లాగ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. అందులో అతని ఫోటోలు, అతని గ్రూప్ మెంబర్ల వివరాలు, ఆ బ్లాగ్ ద్వారా అతను వ్యాపింపజేస్తున్న మత సంబంధిత భావజాలం పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఉన్మాది కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్బ్రాంతి వక్తం చేశారు.