నల్లగొండ జిల్లా.. ఇది ఉద్యమాల ఖిల్లా.. నాడు కామ్రేడ్లు కదం తొక్కిన ఈనేలలో ఇప్పుడు కాంగ్రెస్ కదం తొక్కుతుంది. నాడు తెలంగాణ సాయుధ పోరాట గడ్డగా నిలిచిన ఈ గడ్డ ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి మద్దతుగా నిలిచినప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం ఏనాడు అండగా నిలవడం లేదు. ఇది కేసీఆర్ను కలవరపరిచే అంశంమే. అయితే కామ్రేడ్లను ఆదరించిన ఈ నేల ఇప్పుడు కాంగ్రెస్ను ఆదరిస్తుంది. నల్లగొండ జిల్లా ఉమ్మడి ఏపీలోనైనా, ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోనైనా బలమైన పార్టీగా నిలిచింది కాంగ్రెస్ పార్టీనే.
అయితే ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగే ఉపపోరుకు తెరలేచింది. ఈ ఉప ఎన్నిక అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇంతకు నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉపపోరు జరుగనున్నదో చెప్పలేదు కదూ.. అదేనండీ.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హుజూర్నగర్. నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే ఇప్పుడు తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుని దూకుడు మీదుంది. ఇక కాంగ్రెస్ కు నల్లగొండలో తిరుగులేని పట్టుంది. ఇప్పుడు టీఆర్ఎస్కు మాత్రం కొంత వ్యతిరేకత ఉంది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికి అధికారంలో ఉన్న టీ ఆర్ ఎస్ ఈ స్థానం గెలుచుకుని సత్తా చాటాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న గుత్తా సుఖేంధర్రెడ్డిని తనలో కలుపుకుని టీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీగా చేసి ఏకంగా మండలి చైర్మన్గా నియమించింది.
ఇక ఇప్పుడు హుజూర్నగర్పై కాంగ్రెస్, టీ ఆర్ ఎస్, బీజేపీల నడుమ త్రిముఖ పోరు సాగనున్నది. అయితే అధికారంలో ఉన్న టీ ఆర్ ఎస్ పార్టీ ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకుని తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నది. ఈ సీటు ఇప్పుడు కేసీఆర్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సీటు గెలిస్తే అధికార పార్టీపై ఎలాంటి వ్యతిరేక పవనాలు లేవని తేలిపోతుంది. అదే ఓడిపోతే గులాబీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అపవాదు రాకతప్పదు. ఇక కాంగ్రెస్ కూడా ఈ సీటును గెలుచుకుని తమ బలాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహించిన సీటు. దీనికి తోడు తన భార్య పద్మావతినే పోటీకి దింపుతున్నాడు.
అందుకే ఇది టీ ఆర్ ఎస్కు ఎంత ప్రతిష్టగా మారిందో, కాంగ్రెస్కు కూడా అంతే ప్రతిష్ట ఉన్న స్థానం. అయితే ఇప్పుడు సందులో సడేమియా అన్నట్లుగా బీజేపీ ఈ ఉప ఎన్నికలో తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్లో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఒక బ్రదర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని తమవైపుకు లాక్కునే ప్రయత్నం చేసింది. అతడు బీజేపీలో చేరడం లాంఛనప్రాయమే. అయితే ఇక్కడ బీజేపీ పాగా వేసి తెలంగాణలో మాకు బలం పెరిగిందని నిరూపించుకునేందుకు ఇదోక సువర్ణావకాశం. సో ఇప్పుడు తెలంగాణ లో జరిగే ఈ ఉప పోరు అటు అధికార పార్టీకి, కాంగ్రెస్కు మద్య జరిగే పోరు గానే అభివర్ణించవచ్చు.. కాకుంటే చాపకింద నీరులా బీజేపీ ఈ సీటును ఎత్తుకపోతే అది ఆశ్చర్యమే మరి..