కొందరు నాయకుల తీరే అంత! పార్టీని, ప్రజలను కూడా వాడుకోవడం, తమ వ్యాపారాలను డెవలప్ చేసుకో వడమే వారి అజెండా! ఈ విషయంలో రాజీ పడే సమస్యే లేదు. ఇలాంటి నాయకుల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.. ఇప్పుడు అందరితోనూ ఛీ కొట్టించుకుంటున్నారు పేరెన్నిక గన్న సినీ హీరో.. రాజమండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉంటే .. ఒక విధంగా.. పార్టీ కష్టాల్లో ఉంటే మరో విధంగా ఆయన వ్యవహరించడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది.
సినీ నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన తనకు అవసరం ఉన్నమేరకు రాజకీయాలను వాడుకోవడానికి బాగా అలవాటు పడ్డారనే పేరు తెచ్చుకున్నారు. రాజమండ్రి నుంచి 2014లో గెలుపుగుర్రం ఎక్కిన ఆయన ఏనాడూ ప్రజల సమస్యలపై పోరాడింది లేదు. పైగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పోరాటానికి సిద్ధమైన సమయంలో ఇదెందుకు దండగ అంటూ.. ఆరోగ్యం బాగోలేదనే సాకుతో .. హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఇక, ప్రజలకు కూడా చేరువ కాలేక పోయారు. గెలుపు గుర్రం ఎక్కక ముందు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలేదనే టాక్ ప్రబలంగా వినిపించింది.
ముఖ్యంగా కోడలు రూపాదేవిని రంగంలోకి దించినా.. మురళీ మోహన్పై ఉన్న ఆగ్రహంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. అయితే, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అనుకున్నా.. ఓడిన తర్వాత కూడా ప్రజలకు చేరువ అవుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అదినేత చంద్రబాబే.. ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంపై పోరాటం ఉద్రుతం చేసేందుకు వివిధ పంథాల్లో ముందుకు సాగుతున్నారు. అయితే, మురళీ మోహన్ మాత్రం ఇప్పటి వరకు రాజమండ్రి ప్రజలకు మొహం చూపించింది కూడా లేదు.
పైగా తన కోడలు రూపాదేవి యాక్టివ్ పాలిటిక్స్లో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నా.. వ్యాపారాలకే పరిమితం కావాలంటూ.. తనదైన శైలిలో ఆమె ను రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఇక, కష్టాల్లో ఉన్న పార్టీకి కూడా ఆయన ఆలంబనగా నిలిచింది కూడా ఎక్కడా మనకు కనిపించిందిలేదు. మొత్తానికి మురళీ మోహన్.. తన వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయాలను వినియోగించుకున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ విషయాన్ని టీడీపీ వాళ్లే ఒప్పుకుంటున్నారు.