డైరెక్ట్ టూ హోం కేబుల్ టీవీ కస్టమర్ లను ఆకర్షించే లక్ష్యంలో భాగంగా ప్రతి బ్రాడ్ బాండ్ కనెక్షన్ పై రిలయన్స్ జియో ఉచితంగా సెటప్ బాక్సును ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం నుంచే జియో తన ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం జియో ఫైబర్ కస్టమర్ లు కాంప్లిమెంటరీ సెటప్ బాక్సును పొందే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు పేర్కొన్నాయి.
జియో ఫైబర్ కస్టమర్ లు లాండ్ లైన్ నుంచి జీవిత కాలం ఉచిత వాయిస్ కాల్స్ ను పొందటంతో పాటు సెకన్ కు వంద మెగావాట్ల నుంచి ఒక గిగాబైట్ వరకూ వేగంతో బ్రాడ్ బ్యాండ్ ను పొందుతారని, ఇందుకు నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని, వార్షిక ప్లాన్ పై ఉచిత హెచ్ డి టీవీ సెట్ ను పొందే అవకాశం ఉందని ఇటీవలే రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.
జియో ఫైబర్ కస్టమర్ లు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాప్స్ గురించి సినిమాలూ ఇతర వీడియో కంటెంట్ ను కూడా యాక్సెస్ చేయవచ్చునని నెలవారీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ రేట్లలో భాగంగానే సబ్ స్క్రిప్షన్ ఫీజు ఉంటుందని చెబుతున్నారు. వేరేగా ఎలాంటి చార్జీలు ఉండవంటున్నారు. సెటప్ బాక్స్ ఉన్నవారు టీవీల ద్వారా వీడియో కాలింగ్ సర్వీసును పొందవచ్చునని, ఈ సర్వీస్ కోసం ఎస్టీబికి కెమెరాను అనుసంధానం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి రిలయన్స్ జియో నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు. కాగా జియో ఫైబర్ ద్వారా ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీ వ్యాపారంపై ప్రభావం పడవచ్చునని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.