అంతన్నాడు.. ఇంతన్నాడు.. కేఏ పాల్ ఎక్కడున్నాడు?
కే.ఏ. పాల్... విఖ్యాత మతప్రబోధకుడు... ప్రపంచ దేశాలను చుట్టేసి ... అనేక దేశాధినేతలను కలిసి వచ్చిన పాల్కు ప్రజా ప్రతినిధి కావాలని కోరిక పుట్టింది. అంతే ప్రజా శాంతి పార్టీ పెట్టి .. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చేశారు. హెలీకాప్టర్ గుర్తు తీసుకున్నారు... 2014 ఎన్నికల్లో తనపై కుట్ర జరిగిందనీ... తన డేటాను దోచేశారంటూ ఆయన ఎన్నికలకు దూరమయ్యారు. 2019లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్వయంగా నరసాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దూకారు.
తెలుగుదేశంతో చేతులు కలిపి కేఏ పాల్ .. వైసీపిని దెబ్బతీయడానికి ఫ్యాన్ గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తుతో పోటీ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు... పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధుల పేర్లు గల వారినే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులుగా పాల్ ప్రకటించడమూ వివాదాస్పదం అయ్యింది. ఆ రెండు నెలలు హాట్ టాపిక్ అయిన పాల్... ఎలక్షన్స్లో ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మంచి వినోదాన్నే పంచాడు. రకరకాల విన్యాసాలతో రక్తికట్టించి సోషల్ మీడియాలోనూ తళుక్కుమన్న పాల్... ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు. బిగ్ బాస్ సీజన్ -3లో పాల్ పార్టిసిపెంట్ గా ఉన్నారనే ప్రచారం జరిగినా అది నిజం కాదని తేలిపోయింది. బిగ్ బాస్ లో కనిపించి కనువిందు చేస్తారనుకున్న పాల్... ఏమయ్యారో.. ఎక్కడ ఉన్నారో.. ఎవరికీ తెలియడం లేదు. పాల్... అమెరికాలో ఉన్నట్టు సమాచారం... ఎన్నికలకు ముందు కూడా ఆయన అక్కడే ఉన్నారు... సరిగ్గా ఎన్నికల సమయానికి పిడుగులా ఊడిపడి నానా హంగామా చేసి... అంతే వేగంగా కనిపించకుండా అయిపోయారు. మరెప్పుడు దర్శనమిస్తారో చూడాలి..