జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సోమవారంతో ముగిసింది. గత ఎన్నికల్లో ఆయన తన సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలోని భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పవన్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. భీమవరం నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలను కలుసుకున్న పవన్... నరసాపురం లోక్ సభ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తన అభిమాని జనసేన కార్యకర్త మురళీకృష్ణ కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ కార్యకర్త, పవన్ వీరాభిమాని అయిన కొప్పినీడి మురళీకృష్ణ కేన్సర్ తో బాధపడుతూ, కొద్దిరోజుల కిందట మరణించారు. ఈ క్రమంలోనే పవన్ మురళీకృష్ణ భార్య, తల్లిని పరామర్శించారు. మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఎలా ? మృతి చెందారన్న విషయం కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మురళీకృష్ణ భార్య ఊహా జ్యోతికి ధైర్యం చెప్పారు. జనసేన గెలుపు కోసం మురళీకృష్ణ చేసిన కృషిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కన్నీటి పర్యంతం అయ్యారు. మురళీకృష్ణ తల్లి పవన్ గెలిచినప్పుడే తన కుమారుడి ఆత్మ శాంతిస్తుందని చెప్పడంతో పవన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన వ్యక్తిగత ట్రస్ట్ నుంచి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్ ను మురళీకృష్ణ భార్యకు అందజేశారు.
మురళీకృష్ణ లేనప్పటికీ.. తాను కుమారుడి స్థానంలో ఉంటానని, అన్ని విధాలుగా పార్టీని ఆదుకుంటానని పవన్ వారికి హామీ ఇచ్చారు. పిల్లల చదువులను పార్టీ చూసుకుంటుందని అన్నారు. పార్టీలో ఎంతో నిబద్ధత కలిగిన మురళీకృష్ణ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం ప్రచారం చేశారని కొనియాడారు. ఆయన మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే తాను వాళ్ల కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నానని మీడియాకు చెప్పారు.