అప్పట్లో అంబేద్కర్, పూలే.. ఇప్పుట్లో వై.ఎస్.జగన్..!
నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన వైఎస్ జగన్ పై వైకాపా ఎస్సీ, బీసీ, మైనారిటీ ఎమ్మెల్యేలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి.. జగన్ ను అభినవ అంబేద్కర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అప్పట్లో అంబేద్కర్ పూలే.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ గిరిజన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ అభివర్ణించారు.
మిజోరం, మేఘాలయా, నాగాలాండ్ వంటి 90 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రాల్లోనే వారికి 50 శాతం నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు ఇచ్చే చట్టం ఏదీ లేదు. చట్టసభల్లో సరైన న్యాయం జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. పాదయాత్ర సమయంలో మా సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆచరణలో మాకోసం రిజర్వేషన్లు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం అన్నారు భాగ్యలక్ష్మి.
నేడు వైఎస్ జగన్ ని చూస్తే మాకు నవయుగానికి అంబేద్కర్ లా, అల్లూరి సీతారామరాజులా కనిపిస్తున్నారని ఆమె చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వెనుకబడిన వర్గాల ప్రజలంతా అంబేద్కర్, పూలే, కొమరం భీంతో కీర్తిస్తున్నారని మరో ఎమ్మెల్యే తెల్లం బాలారాజు అన్నారు.
చారిత్రాత్మక చట్టాన్ని రూపొందించిందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఆయన శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నవారిని అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ గొప్ప ఆలోచన చేశారని అభినందించారు.