సినీరంగంలో ప్రభాస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలితో తన నటన విశ్వరూపం చూపిన ప్రభాస్...రాబోయే సినిమా సాహోతో ఆ క్రేజ్ను మరింత పెంచుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ విషయంలో సంచలన ప్రకటన వెలువడింది. ప్రభాస్ పెదనాన్న,రెబల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో...ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కాషాయ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో సంఘటన పర్వ్ 2019 పేర సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్న సందర్భంగా కృష్ణంరాజు ఈ ప్రకటన చేశారు.
కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 1980 నుంచి తనకు బెజవాడతో అనుబంధం ఉందన్నారు. మంత్రిగా నెల రోజులుగా ఒక స్టూడెంట్గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఒక శాతం లేని త్రిపుర,6 శాతం లేని అస్సాంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని,ఇక్కడ కూడా వస్తామని ధీమా వ్యక్తంచేశారు. అధ్యక్షుడు ఎవరో చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పరిస్దితి అయిపోయిందని, 11 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ అతిపెద్డ పార్టీగా బీజేపీ ఎదగనుందని, రాష్ట్రంలోను రాజకీయ ప్రకంపనలు రానున్నాయన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు కేంద్రం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.
మాజీ మంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మాట్లాడుతూ, తన ఫ్యాన్స్, ప్రభాస్ పాన్స్ బీజేపీలో చేరి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో అభిమానులను బీజేపీలో చేరమని తాను చెప్పలేదని అయితే, ఇప్పుడు చెప్తున్నానని అన్నారు. ప్రపంచం అంతా మోడీయిజం నడుస్తుందన్నారు. దేశంలోనూ మోదీ వేవ్ ఉందని చెప్పుకొచ్చారు.