బాబుకు మరో షాక్.. ఎంపీలను టార్గెట్ చేసిన బిజెపి..?
ఏపీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన తెలుగుదేశానికి ఎదురు దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశంలో రాజకీయంగా భవిష్యత్ లేదని భావిస్తున్న కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వంటి పార్టీలు టీడీపీ ఎంపీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
లోక్సభలో మంచిమెజార్టీ ఉన్న బిజెపి.. రాజ్యసభలో మాత్రం ఇంకా మైనారిటీ లోనే ఉంది. ఈ లోటు పూడ్చుకునేందుకు తెలుగుదేశం వంటి పార్టీల నేతల వైపు కమల దళం కన్నేసింది. రాజ్య సభలో తెలుగుదేశానికి ఆరుగురు ఎంపీలు ఉన్నారు.
కుదిరితే వీరందరిని లేకపోతే కొందరినైనా బిజెపి గూటికి చేర్చాలని కమల నాధులు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొందరు ఎంపీలతో చర్చలు జరిగాయట. వీరితో పాటు కొత్తగా లోక్సభకు ఎన్నికైన ముగ్గురి పైన బిజెపి కన్నేసింది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉండటం కంటే.. పవర్ లో ఉన్న బిజెపి లోకి జంప్ చేయడం మేలు అని ఆలోచన కొందరు టీడీపీ ఎంపీ లో ఉంది. తెలుగుదేశం అనుకూల పత్రికలలో నే ఈ మేరకు కధనాలు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజెపుతోంది.