ఇండియా టుడే.. దేశంలోనే నెంబర్ వన్ పొలిటికల్ మేగజైన్... 2019 లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల విద్యార్హతల గురించి ఓ సర్వే నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2019లో ఎన్నికల బరిలో నిలిచిన వారిలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 48 శాతం మంది మాత్రమే. అంటే బరిలో నిలిచిన వారిలో కనీసం సగం మంది అభ్యర్థులు కూడా డిగ్రీ పాస్ అయినవారు లేరన్నమాట.
అత్యధిక మంది ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపిన పార్టీగా వైయస్ఆర్సీపీ ఈ సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. వైయస్ఆర్సీపీ నుంచి లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా 88 శాతం మంది డిగ్రీ లేదా అంతకన్నా పై చదువులు చదివిన విద్యావంతులు ఉన్నారు. ఉన్నత విద్యావంతులను ఎన్నికల బరిలో నిలిపిన వైయస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపే అంశంలో ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా దక్షిణాదికి చెందిన పార్టీలే ముందంజలో ఉన్నాయి. అభ్యర్థుల విద్యార్హతలను పార్టీల వారీగా చూసుకుంటే.. అత్యధికంగా 88 శాతం మంది డిగ్రీ లేదా ఆపై చదువులు చదివిన విద్యావంతులను బరిలోకి దింపిన పార్టీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిశీలనలో ప్రథమస్థానంలో నిలిచింది.
86.4 శాతం మంది విద్యావంతులైన అభ్యర్థులతో ఏఐఏడీఎంకే, 82.4 శాతంతో టీఆర్ఎస్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తమిళనాడుకు చెందిన నామ్ తమిళియార్ కచ్చి పార్టీ తరఫున లోకసభ బరిలో నిలిచిన వారిలో 80 శాతం డిగ్రీ ఉత్తీర్ణత సాధించివారు ఉన్నారు. జాతీయ పార్టీల విషయానికొస్తే.. ఉన్నత విద్యావంతులను బరిలో నిలిపిన పార్టీల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉండగా.. అధికార బీజేపీ పార్టీ ఐదో స్థానంలో నిలిచింది.