అవును! మరో 75 రోజుల్లో ఏపీలో సునామీ రాబోతోందా? అసెంబ్లీ ఎన్నికల పెను తుఫానులో గెలిచి బట్టకట్టేదెవరు? ఎవ రు ఎలా ముందుకు వెళ్తారు? అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. ఇకపైఈ 75 రోజుల పాటు సాగబో యే పరిస్థితి మరొక ఎత్తు. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అధికారంలోకి తిరిగి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న ఎత్తులు ఊపందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని భారీ ఎత్తున బాకా ఊదిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలోని 94 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10000 వేల చొప్పున పందేరం చేస్తున్నారు. అడిగేవారు లేనప్పుడు.. బాబు ఎందాకైనా పరిగెడతారనడానికి ఇది ఉదాహరణ.
ఎన్నికల ఎత్తుల్లో భాగంగా మళ్లీ పవన్కు దగ్గరయ్యేందుకు కూడా చంద్రబాబు వెనుకాడడం లేదు. ప్రధానంగా రాజకీయా ల్లో ప్రజలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు బాబు. ఇక, వైసీపీ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. చంద్రబాబుకు అదికారం చేతిలో ఉందికాబట్టి ఆయన ఏమైనా చేస్తున్నారు. కానీ, వైసీపీ కూడా తాము అధికారంలోకి వస్తే.. మరింతగా పింఛన్లు పెంచుతామని, అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నాయకుల ఎంపికపై పూర్తిగా కసరత్తు చేసిన జగన్ కేవలం డబ్బున్న వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తూ.. తన ప్రత్యేకతను చాటుతున్నారు. అదేసమయంలో ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలపైనా ఆయన దృష్టి పెట్టారు.
నిజానికి వచ్చే ఎన్నికల్లో డబ్బు బాగా ప్రభావం చూపుతుందని అంటున్న నేపథ్యంలో జగన్ తన దారిలో తానునడుస్తున్నారు ఇక, మరో కీలకమైన పార్టీ పవన్ నేతృత్వంలోని జనసేన. ఎన్నికలకు 75 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంకా నింపాదిగానే అడుగులు వేస్తున్నాడు పవన్. పార్టీలో రిక్రూట్మెంట్లు చేయడం దాదాపుగా ఎక్కడా కనిపించడం లేదు. కొత్తగా వచ్చి చేరుతున్న వారికి సరైన భరోసా లభించడం లేదనే కారణంగా చేరుతున్న వారు, చేరాలని అనుకున్న వారు సైతం తగ్గిం చుకున్నారు. దీంతో జనసేన పరిస్థితి రెండడుగులు ముందుకు , నాలుగు అడుగులు వెనక్కి చందంగా మారి పోయింది. మరోపక్క, విఫలమైన వామపక్షాలతో పొత్తులపై కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి.
మొత్తంగా జనసేన పూర్తిగా కాకుండా పాక్షికంగానే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించేలా ఉందని అంటున్నారు. మరి ఈ పరిణామం ఆ పార్టీకి మంచిదో కాదో చూడాలి. ఇక, కాంగ్రెస్ ఒంటరిపోరు అని ప్రకటించినా.. పోటీకి ఎవరూ సిద్దంగా లేకపోవడం గమనార్హం. కనీసంలో కనీసం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే. 50 లక్షలైనా ఖర్చు చేయాలి. ఇదేమన్నాతిరిగి వస్తుందా? నాయకులు గెలుస్తారా? అనేది సందేహంగానే మారింది. దీంతో ఎవరూ ముందుకు రావడం లేదు. మరోపక్క, బీజేపీ పరిస్థితి కూడా ఇలానే ఉండడం గమనార్హం. మరి ఎన్నికలకు 75 రోజుల గడువు మాత్రమే ఉండడంతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.,