తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రంజుగామారుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అసెంబ్లీ రద్దు చేసి.. పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు కేసీఆర్. ప్రతిపక్షాలకు దిమ్మదిరిగేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. 105మంది అభ్యర్థులను ప్రకటించి, మిగతా 14 స్థానాలను పెండింగ్ పెట్టారు. అయితే.. వీటినే ఎందుకు పెండింగ్ పెట్టారనే దానిపై పార్టీవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కొన్ని కాంగ్రెస్, బీజేపీ, తదితర స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా టీ కాంగ్రెస్ టాప్ లీడర్ల స్థానాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా టీపీసీపీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి నల్లొండ జిల్లా హుజూర్నగర్, ఆయన భార్య తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహించిన కోదాడ నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే.. కాంగ్రెస్ టాప్ లీడర్లను ఓడించేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ స్థానంలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి ఉత్తమ్కుమార్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆమెకే టికెట్ ఇస్తే.. మళ్లీ ఓడిపోతుందనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. మరోవైపు ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలంటూ శంకరమ్మ ఆందోళన చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇక్కడి నుంచి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిని బరిలోకి దించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇలా బలమైన అభ్యర్థిని బరిలోకిం దింపేతేనే ఉత్తమ్ను ఓడించడం సాధ్యమవుతుందని పలువురు నాయకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహించిన కోదాడలో కూడా బలమైన నేతను పోటీలో నిలపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేరు వినిపిస్తోంది. ధన బలం ఉన్న నేతగా పొంగులేటికి గుర్తింపు ఉంది. దీంతో ఆయనను బరిలోకి దింపితే పద్మావతి రెడ్డిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఆశావహులు కూడా టికెట్లు ఆశించడం కేసీఆర్కు తలనొప్పిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం కోసం పార్టీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.