జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాష్ట్ర రాజకీయాలు ఇంత వేగంగా మారిపోతున్నా పవన్ మాత్రం స్పందించటం లేదు. అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ వెంటనే అడ్మిట్ చేసుకున్న దగ్గర నుండి ఢిల్లీ కేంద్రంగా ఏపి రాజకీయాలు స్పీడందుకుంది. తాము ఎంత మొత్తుకున్న, ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చినా పట్టించుకోని స్పీకర్ తాజాగా టిడిపి ఇచ్చిన నోటీసును వెంటనే అడ్మిట్ చేసుకోవటం ఏంటంటూ వైసిపి మాజీ ఎంపిలు మండిపోతున్నారు.
వైసిపి నోటీసులు ఎందుకు తీసుకోలేదు ?
బడ్జెట్ సమావేశాల్లో వైపిపి ఎంపిలు 13 సార్లు అవిశ్వాస తీర్మనానికి నోటీసులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసనగా చివరకు వైసిపి ఎంపిలు రాజీనామాలు కూడా చేశారు. ఇపుడు లోక్ సభలో వైసిపి ఎంపిలు లేని విషయాన్ని చంద్రబాబు అవకాశంగా మలుచుకున్నారు. తెరవెనుక రాజకీయం చేయటంతో నోటీసును మొదటి రోజే అడ్మిట్ చేసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే తెరవెనుక ఏదో రాజకీయం జరిగిందని అందరిలోనూ అనుమానాలు మొదలైపోయాయి. అదే విషయాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం మాట్లాడటం లేదు.
బిజెపి-టిడిపిలపై మండుతున్న విపక్షాలు
ఎప్పుడైతే టిడిపి నోటీసుపై స్పీకర్ అంత వేగంగా సానుకూలంగా స్పందించారో వెంటనే వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే, బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై వైసిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూసిందే. సమావేశాల చివరి వరకూ వేచి చూసిన ఎంపిలు చివరి రోజున తమ రాజీనామాలు సమర్పించటం తదితర విషయాలన్నీ అందరూ చూసిందే.
తెరవెనుక ఏం జరిగింది ?
ఇపుడు లోక్ సభలో వైసిపి ఎంపిలు లేరు. దాంతో చంద్రబాబు అడ్వాంటేజ్ తీసుకుని తెరవెనుక మంత్రాంగం నడిపారు. దాంతో టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వెంటనే అడ్మిట్ అయ్యింది. అప్పటి నుండి టిడిపి-బిజెపి కుమ్మక్కు రాజకీయాలంటూ వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు మండిపోతున్నాయి. ప్రతిపక్షాలు అన్నాయని కాదు కానీ బిజెపి-టిడిపి మధ్య తెరవెనుక రాజకీయం ఏదో జరిగిందని అర్దమైపోతోంది అందరికీ. ఇంత జరుగుతున్నా కుమ్మక్కు రాజకీయాలను పవన్ ఎందుకు ప్రశ్నించటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు.
పవన్ అడ్రస్ ఎక్కడ ?
రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం అడ్రస్ లేరు. కుమ్మక్కు రాజకీయాలపై పవన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి వరకూ బిజెపి, టిడిపి అధినేతలను నోటికొచ్చినట్లు విమర్శించిన పవన్ తాజా పరిణామాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. రేపే లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. అందుకే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ఇటువంటి నేపధ్యంలో పవన్ నుండి ఒక్క మాట కూడా రాకపోవటంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.