ఎడిటోరియల్: పలు యూటర్నుల టిడిపి బాబుల అవిశ్వానికి దేశప్రజల విశ్వాసం ఉందా?

నాలుగు సంవత్సరాలకు పైగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో అంటకాగి ప్రయోజనాలన్నీ పొంది దేశంలో ఏరాష్ట్రానికి అందించని సహకారం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం అందిస్తుందని వేలసార్లు   ప్రజావేదికలపైనే  కాకుండా శాసనసభలోఘోషించిన చంద్రబాబు యూ-టర్న్ తీసుకొని నేడు కేంద్రంపై అవిశ్వాసం అనే నాటకానికి పలుమార్లు తెరతీస్తున్నారు. అనవసరంగా ప్రజల సమయాన్ని వృధా చేసేబదులు ఏ పని సాధించలేని ఈ అప్రయోజక ప్రభుత్వం పాలన నుండి రాష్ట్రాన్ని సంరక్షించు కుంటే తప్ప వేరే మార్గం లేదని విఙ్జుల భావన.  


నాడు ఏపి లోని ప్రతిపక్షం కేంద్రంపై అవిశ్వాస నోటీసును ప్రవేశ పెట్టినప్పుడు దానికి పోటీగా అవిశ్వాసం ప్రవేశ పెట్టింది టిడిపి. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలనే తపన తెలుగు దేశానికి నిజంగా ఉంటే నాడు వైసిపితో కలసి కేంద్రంపై  పోరాడి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళ పార్టీ లలా ఐఖ్యంగా పోరాడాలి.  చంద్రబాబుకు క్రేడిట్ కొట్టేయటం, తనపార్టీకి ఏ మైలేజ్ వస్తుందన్నదానిపై ఉన్న శ్రద్ద, ఐఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం డిమాండ్ల సాధనలో లేకపోవటం చంద్రబాబు మనస్తత్వానికి అద్దంపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. 

అందుకే ఇప్పుడు తమ పార్టీపై ప్రజా వ్యతిరేఖతను తగ్గించుకోవటానికి టీడీపీ మరోసారి కేంద్రంపై అవిశ్వాస నోటీసును మంగళవారంనాడు  ఇచ్చింది. ఈ మేరకు డిల్లీలో స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన  హమీలను అమలు చేయాలని  కేంద్రప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.

జూలై 18వ తేదీ అంటే నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో కేంద్రంపై మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడ  కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. కానీ, ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు అందినా, సభలు ఆర్డర్‌ లో లేనందున  అవిశ్వాస నోటీసులపై చర్చ జరగలేదు.

అయితే రేపటి నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కూడ  కేంద్రం తీరును ఎండగట్టేందుకు గాను  అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు టీడీపీ ఎంపీలు. కేంద్రంపై తాము ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతివ్వాలని టీడీపీ ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగట్టటానికి ప్రయత్నిస్తున్నాయి . ఐతే వీటి మద్య ఐఖ్యత లేదు 'ఎవరికి వారే యమునా తీరే' లాగ మరో సారి చేసే ఈ ప్రయత్నం వైఫల్యం చెందటం తధ్యం. టిడిపి స్వప్రయోజనాలు మానేసి ఐఖ్యతతో పనిచేస్తే ప్రయోజనాలు సాధించటం తధ్యం. 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి ఉన్న ఎంపిల బలంసరిపోదు. ఇతరులు టిడిపి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితులు లేవు. కాకపోతే ఏభైకి పైగా సభ్యులున్న కాంగ్రెస్ స్వంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టటానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. దీంతో అసలు టిడిపి అవిశ్వాస తీర్మానమే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: