ఈమధ్య తెలుగుదేశంపార్టీ శ్రేణులు ఎవరిమీద పడితే వారిమీద దాడులు చేస్తున్నారు. అనవసరంగా దాడులు చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈరోజు వైసిపి నగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ రోజాపై దాడి చేశారు. పుత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంఎల్ఏను టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. రోజా సంగతి అందరికీ తెలిసిందే కదా ? అసలే ఫైర్ బ్రాండ్. ఆపై పెద్ద నోరున్న ఎంఎల్ఏ. ఇంకేముంది మంటలు మండటానికి. అదే జరిగింది చివరకు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంఎల్ఏపై దాడి చేశారు. బహుశా వారి ఉద్దేశ్యంలో ప్రభుత్వ కార్యక్రమం అంటే అధికార పార్టీ నేతలే పాల్గొనాలని ఉందేమో ఎవరికీ అర్ధం కావటం లేదు.
ప్రోటోకాల్ వివాదం
ఆ విషయంలోనే రోజాకు, టిడిపి నేతలకు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. రెండు వైపులా తోపులాటలు జరిగింది. హటాత్తుగా టిడిపి కార్యకర్తలు కొందరు రోజాపై భౌతికంగా దాడికి ప్రయత్నించారు. అయితే, అప్రమత్తంగా ఉన్న రోజా మద్దతుదారులు వెంటనే టిడిపి కార్యకర్తలను ప్రతిఘటించారు. దాంతో పెద్ద తోపులాటే జరిగింది. ఇదంతా కూడా మంత్రి అమరనాధ్ రెడ్డి సమక్షంలోనే జరగటం గమనార్హం.
ప్రతిపక్షాలపై పెరుగుతున్న దాడులు
అసలు అంతకుముందే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. జిల్లాలో రైతులను నట్టేటముంచుతున్నట్లు ధ్వజమెత్తారు. మొన్న టమోటా, ఇపుడు మామిడి రైతులు రోడ్డుపాలైనట్లు ఎగిరిపడ్డారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పుత్తూరులో రోజాపై టిడిపి కార్యకర్తలు దాడి ప్రయత్నం చేశారు. ఈమధ్యనే అనంతపురంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై దాడికి ప్రయత్నించారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్ధం వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పైన కూడా దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రతిపక్షాలపై టిడిపి శ్రేణులు దాడులు ఎందుకు చేస్తున్నారో అర్దం కావటం లేదు.