టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కుజ్రీవాల్ తోడయ్యారు.. బాబుకు కేజ్రీ తోడుకావడమేమిటి..? అని అనుకుంటున్నారా..? నిజమే.. ఎవరి రాష్ట్రం కోసం వారే పోరాడుతున్నా.. వారి టార్గెట్ మాత్రం ఒక్కరే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాటతప్పిన ప్రధాని మోడీని, బీజేపీ పెద్దలను ఏకిపారేస్తున్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ.. కేజ్రీవాల్ కూడా మోడీపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా బీజేపీకి ఆయన సరికొత్త సవాల్ విసిరారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఆమోదిస్తే.. బీజేపీ తరుపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తాననీ, ప్రతీ ఒక్కరు బీజేపీకే ఓటు వేయాలని కోరుతానని కేజ్రీ అన్నాయి.
ఒకవేళ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వకుంటే.. ఢిల్లీలో బీజేపీ ఉండదు.. అనే బోర్డులు వెలుస్తాయనీ.. ఎవ్వరూ కూడా మద్దతు ఇవ్వరని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మాత్రమే కేంద్రంపై ఉద్యమిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చంద్రబాబు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏకంగా చంద్రబాబు కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
సుమారు ఏప్రిల్ 20న తన పుట్టిన రోజున చేపట్టిన ధర్మపోరాట దీక్ష మొదలు ఇప్పటివరకూ ఆయన నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఏపీకి మోడీ చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ-వైసీపీ కుట్ర రాజకీయాలను కూడా బట్టబయలు చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీయేతర పక్షాల నేతలందరూ దాదాపుగా వచ్చారు. ఇందులో కేజ్రీవాల్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితర కీలక నేతలు ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇక్కడే హోదా ఉద్యమం గురించి చంద్రబాబు వారికి వివరించినట్లు సమాచారం. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మోడీపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పలువురు నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయేలో కొనసాగుతున్న జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, లోక్జనశక్తి నేత, కేంద్రమంత్రి రాంవిలాస్పాశ్వన్ కూడా బిహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తేవడం గమనార్హం. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ టార్గెట్గా ఎన్డీయేను చుట్టుముడుతున్నారు.