అధికార టీడీపీ ప్రభుత్వ చీఫ్ విప్, అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే యామినీబాల ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లోకి వస్తున్నారు. పైకి సాఫ్ట్ గానే కనిపిస్తున్నా..తెర వెనుక వర్గాలను పోగు చేయడం, రచ్చ చేయించడంలో ఆమెకు ఆమే సాటి అనే విషయం ఇప్పుడు భారీగా వినిపిస్తోంది. నిజానికి అనంతపురం జిల్లా అంటేనే ఇప్పుడు టీడీపీ మయం. ఇక్కడ దాదాపు అందరూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే కనిపిస్తున్నారు. దీంతో పార్టీ భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుందని, పార్టీకి తిరుగులేకుండా పోతుందని పార్టీ అధినేత చంద్రబాబు కాంక్షించారు.
అయితే, ఈ విషయాన్ని పక్కన పెట్టిన నేతలు.. తమ తమ వర్గాలను పెంచి పోషించుకోవడంలోను, ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలోనూ ఒకరిని మించి ఒకరు ముందంజలో ఉంటున్నారు. ఇక, మహిళా నేతగా గుర్తింపు పొందిన చీఫ్ విప్ యామినీ బాల.. వర్గం మరింత హవా చెలాయిస్తోందనే వార్తలు తాజాగా అందరినీ నివ్వెర పరుస్తున్నాయి. ఆమెను అదుపు చేయడం ఒక్క చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. పుట్లూరు మండలంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల వర్గాలదే ప్రధాన హవా నడుస్తోంది. ఎమ్మెల్యే జేసీ వర్గం కంటే యామినీబాల వర్గీయులే దుందుడుకుగా వ్యవహరిస్తూ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
యామినీబాల వర్గానికి చెందిన కొందరు ప్రముఖులు అధికారుల పై సవారీ చేయడమే ధ్యేయంగా ఉంటున్నారు. వీరి ఒత్తిడి కారణంగా పుట్లూరు ఎంపీడీఓగా పనిచేసిన నెహమ్య తాడిపత్రికి డిప్యుటేషన్పై వచ్చారు. ప్రస్తుతం ఈఓఆర్డీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నా రు. పుట్లూరు ఎంపీడీఓగా నెహమ్య డిప్యుటేషన్పై తాడిపత్రికి ఎందుకు రావలసి వచ్చింది అంటే రాజ కీయ ఒత్తిడులే అన్న బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒత్తిళ్ల కారణంగా ఎంపీడీఓ నెహమ్య డెప్యుటేషన్పై తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ విషయం తెలుసుకున్న ఈఓఆర్డీ మధుసూదన్రెడ్డి, సూపరింటెండెంట్ క్రిష్ణమూర్తి ముందు జాగ్రత్తగా లీవుపై వెళ్లారు. మీరు ఉంటే తప్ప మేము పుట్లూరులో పనిచేయమంటూ వారు ఖరాకండీగా ఎంపీడీఓతో చెప్పడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో ఎంపీడీఓ నెహమ్య తన డెప్యుటేషన్ను వాయిదా వేసుకోవడంతో ఈఓఆర్డీ, సూపరింటెండెంట్ విధుల్లో చేరారు. వీరు విధుల్లో చేరిన కొంతకాలానికి ఆయ న తాడిపత్రికి డిప్యుటేషన్పై వచ్చారు. ప్రస్తుతం ఈఓఆర్డీకి ఇన్చార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు అ ప్పగించారు. ఈమధ్యకాలంలో ఇన్చార్జ్ ఎంపీడీఓపై కూడా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఆయనతోపాటు సూపరింటెండెంట్ కూడా సెలవుపై వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. గతంలో ఏపీఓగా పనిచేసిన విజయనిర్మల తమ మాట వినలేదన్న ఆగ్రహంతో బదిలీపై వచ్చిన ఆరు నెలల్లోపే ఒక ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తీసుకొచ్చిమరీ గుంతకల్లుకు బదిలీ చేయించారు.
మరొకవర్గం ఏపీఓకు తిరిగి పుట్లూరుకు బదిలీపై తీసుకొచ్చారు. కానీ ఆమె రెండోసారి కూడా ఆరునెలలు కూడా పనిచేయలేదు. తాము బదిలీ చేస్తే మరొకరు తిరిగి పో స్టింగ్ వేయించుకుంటారా అంటూ మండిపడుతూ తీవ్రస్థాయిలో పైరవీలు జరిపి మరీ ఆరు నెలలకే ఆమెను బదిలీ చేయించారు. ఆమె స్థానంలో ఏపీఓగా తాడిపత్రిలో పనిచేస్తున్న గంగరాజును వేశారు. ఈయన కూడా పట్టుమని ఆరునెలలు కూడా కాలేదు. తమ మాట లెక్కచేయలేదన్న మండిపాటుతో కొందరు నేతలు ఆ ప్రజాప్రతినిధికి చాడీలు చెప్పారు. దీంతో ఆయన్ను యల్లనూరుకు బదిలీ చేయించారు. ప్రస్తుతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్నికల్ అసిస్టెంట్ను ఇన్చార్జ్గా నియమించారు. ఉపాధిహామీ ఇంజనీర్ గా పనిచేస్తున్న రామ్మోహన్రెడ్డిని బలవంతంగా బదిలీ చేయించారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించకుండా టెక్నికల్ అసిస్టెంట్ను ఇన్చార్జ్గా వేయించారు.
తహసీల్దార్గా పనిచేస్తున్న పుల్లన్నపై కూడా ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తమ పనులు చేయించాలంటూ పలువురు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా వాటిని పట్టించుకోకపోవడంతో మండిపడుతూ ఆ ప్రజాప్రతినిధి ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు యామినీబాల వర్గం ఇటు నియోజకవర్గంలోనూ అటు అధికారులపైనా ఆధిపత్యం చెలాయిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెను కంట్రోల్ చేయాలని ఎవరూ సాహసించకపోవడం కూడా గమనార్హం. అన్నట్లు.. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో యామినీ బాల బెర్త్ దోరుకుతుందని ఆశించారు. అయితే, ఆ ఆశ అడియాశ అయింది. దీంతో ఆమె వర్గం మరింతగా రెచ్చిపోతోందని సమాచారం. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఆమెను కంట్రల్లో పెడతారో? లేదో చూడాలి.