మోత్కుపల్లి మళ్లీ పంచ్ వేశారు..!

Edari Rama Krishna
తెలంగాణలో టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు గత కొంత కాలంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  తాజాగా తెలంగాణ టిడిపి శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోయిందనే ప్రచారం కంటే ఇదే నయమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.

ఇవాళ ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భుజాన ఎత్తుకుని పార్టీని కాపాడుకుందామన్న సహకరించే వారు లేరన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు మానసికక్షోభ అనుభవిస్తున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో పార్టిని బలోపేతం చేసే విషయమై మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబునాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయమై మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన మోత్కుపల్లి ప్రకటన తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీసింది.

పార్టీలో మరో సంక్షోభానికి ఇది దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే  చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నానని, ఆయన అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: