రాష్ట్రంలో ఒకప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు తెలియని వాళ్లు లేరు. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్లో విద్యుత్ శాఖలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు విపక్షాలపై నిప్పులు చెరిగిన తీరును, విద్యుత్ ధరలను పెంచాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం పక్షాన ఆయన సమర్ధించుకున్న విధానాన్ని ఏ ఒక్కరూ మరిచిపోలేదు. అయితే, అనూహ్యంగా అలాంటి నేత కు ఇప్పుడు పొలిటికల్ ప్లాట్ ఫాం లేకుండా పోయింది! దీంతో ఇప్పుడు అసలు ఆయనకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. ఆయన అనుచరులు అయితే.. కొత్తపల్లిది పూర్తిగా స్వయం కృతం అని ఆరోపిస్తున్నారు. నాడు టీడీపీలో హీరోగా ఉన్న వ్యక్తి...నేడు జీరో అయిపోయాడు. ఏదేమైనా ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్తపల్లి ప్రస్తానం ముగిసిపోయిందనే అంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ పొలిటికల్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెబితే కొత్త పల్లి పేరే విన్పించేది. నర్సాపురం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలుపొందారు. అన్నగారి ప్రభంజనం సాగుతున్నసమయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని ఓనమాలు నేర్చుకున్న కొత్తపల్లి.. తర్వాత తన పొలిటికల్ విశ్వరూపం చూపించాలని ఎంతగానో తాపత్రయ పడ్డారు. ఈ క్రమంలోనే ప్రజలు పార్టీలను కాదు, తనను బట్టే నడుస్తారని అతిగాపోయి.. కొంప కొల్లేరు చందంగా తన భవిష్యత్తును తానే కాలరాసుకున్నారు.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఏపీలో అధికార పగ్గాలు కాంగ్రెస్కు చేరిపోయాయి. దీంతో టీడీపీ విపక్షానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే అప్పటి వరకు ఆ పార్టీలో పదవులు అనుభవించిన కొత్తపల్లి.. ఒక్కసారిగా పార్టీ మారే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం రావడంతో దానిలోకి కొత్తపల్లి జంప్ చేయడం చాలా తేలికగా జరిగిపోయింది. ఇదే.. ఆయన పొలిటికల్ కెరీర్కు పెద్ద బ్యాక్ డ్రాప్ అవుతుందని ఆయన ఆనాడు ఊహించలేదు. చిరంజీవిని నమ్ముకుని ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ కండువాను కప్పుకోవాల్సి వచ్చింది.
2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రాష్ట్ర విభజన జరగడంతో అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. ఈ సారి జగన్ పార్టీని నమ్ముకున్నారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అధికారంలో లేని వైసీపీలో ఉండలేక తనకు రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీలో తిరిగి చేరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో చేరి వచ్చిన కొత్తపల్లికి ఇప్పుడు టీడీపీలో కూడా విలువ లేకుండా పోయింది. ఆయన్ను పట్టించుకునే వారే లేరు. కనీసం ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా ఆయన వైపు చూడటం లేదు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం?! రాజకీయాలకు దూరంగా ఉండడమా? జనసేనలో చేరడమా? రెండే ఆప్షన్లు ఇప్పుడు కొత్తపల్లికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన రెండోదే ఎంచుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కొత్త రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని అనుకొవచ్చంటున్నారు ఆయన అనుచరులు.