మోదీకి జీ-7 దేశాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం
భారత ప్రధానిగా మోదీ విదేశీ పర్యటనలు అన్నీ విజయవంతమే. ఇలాంటి పర్యటనలతోనే ఆయా దేశాలకు భారత్ తో స్నేహ సంబంధాలను మరింత బలపరుస్తూంటారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ఉనికిని ఘనంగా చాటుతూంటారు మోదీ. ప్రస్తుతం బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ కు బయలుదేరారు. ఈరోజు జరగే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొనబోతున్నారు.
అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన శ్రీనాథ్జీ ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. శనివారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసాన్స్’తో మోదీని సత్కరించారు. మోదీ తన సోదరుడు అని అబుదాబికి కాబోయే యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అన్నారు. యూఏఈ మోదీకి రెండో ఇల్లు అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు మోదీ మనామాలోని బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో వేలమంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాస భారతీయులను కోరారు. త్వరలో బహ్రెయిన్ లో ప్రవాస భారతీయుల కోసం రూపే కార్డులను ప్రవేశపెడతామని మోదీ ప్రకటించారు.
బెహ్రెయిన్ పర్యటన అనంతరం ఫ్రాన్స్ లో జరుగుతున్న జి-7 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొనబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. భారత్లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమ వాణిజ్యానికి మార్గాలు సుగమం చేయాలని ఈ భేటీలో ట్రంప్ కోరనున్నట్టు అధికారులు తెలిపారు.