ఏపీ లో డ్రోన్లు వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి
కృష్ణానది కరకట్టపై వరద అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ డ్రోన్ ను వినియోగించడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది . మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పై ఇటీవల డ్రోన్ ఎగరడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వరద అంచనాల కోసమే జలవనరుల శాఖ అద్వర్యం లో డ్రోన్ ద్వారా చిత్రీకరణ చేయడం జరిగిందని వివాదాన్ని ముగించే ప్రయత్నాన్ని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు . అయినప్పటికీ తమ్ముళ్లు వినలేదు .
మాజీ ముఖ్యమంత్రి భద్రతను ప్రమాదం లోకి నెట్టేందుకే వైకాపా నేతలు కుట్ర పన్ని డ్రోన్ ద్వారా చంద్రబాబు ఇంటిని చిత్రీకరించారని వారు ఆరోపించారు. ఈ విషయమై తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వరదల అంచనాల కోసమే జలవనరులశాఖ డ్రోన్ వినియోగించిందని, స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం వల్లే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చెప్పారు . చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరడం లో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చి చెప్పారు. డ్రోన్ వినియోగాన్ని రాజకీయం చేయవద్దన్న అయన , ఎవరైనా ఇకపై డ్రోన్లు ఉపయోగించాలంటే స్థానిక పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు . ఇరిగేషన్ శాఖ అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయలేమి కారణంగానే ఈ వివాదం నెలకొంది గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇటీవల ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై డ్రోన్ ఎగరడం హాట్ టాఫిక్ గా మారింది . డ్రోన్ ద్వారా చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని చిత్రీకరించారని టిడిపి నేతలు ఆరోపించారు . మాజీ సీఎం ఇంటిని డ్రోన్ ద్వారా ఎలా చిత్రీకరిస్తారని వారు ప్రశ్నించారు . బాబు ఇంటిని డ్రోన్ ద్వారా చిత్రీకరణకు ప్రయత్నించిన వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇదే విషయమై చంద్రబాబు డీజీపీ తో పాటు గుంటూరు ఎస్పీ తో మాట్లాడినట్టు తెలుస్తోంది . హై సెక్యూరిటీ జోన్ లో డ్రోన్ ఎలా వినియోగించారని, ప్రభుత్వం , పోలీసుల అనుమతి ఉందా? అని అయన ప్రశ్నించగా అధికారులు పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం . దీనితో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .