సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఓటమి భయం కావచ్చు మరేదైనా అంశం అయి ఉండవచ్చు కానీ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనేక అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రిటైర్డ్ అధికారులు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు వెళ్లడంపై ఆయన కస్సుమన్నారు. పార్టీ అధినేతగా చంద్రబాబు అభ్యంతరం తెలపడంతో...టీడీపీ నేతలు సైతం రిఐటర్డ్ ఐఏఎస్లపై మండిపడ్డారు. అయితే, చంద్రబాబు ఆండ్ కో తీరును పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాజాగా, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చంద్రబాబు తీరును సూటిగా ఎండగట్టారు.
విశ్రాంతి అధికారులు గవర్నర్ వద్దకు వెళితే సీఎంకు ఎందుకు అభ్యంతరమని నాగేశ్వర్ సూటిగా ప్రశ్నించారు. ``విశ్రాంతి అధికారులు సాధారణ పౌరులతో సమానం. వారికి రాజకీయ అభిప్రాయం సైతం ఉండవచ్చు.దాన్ని ముఖ్యమంత్రి అధికారులు తప్పుపట్టడం సరికాదు.సీఎస్ను మార్చినపుడు, ఎస్పీలను మార్చినపుడు మీరెక్కడ? అని వారిని నిలదీయం చిత్రంగా ఉంది. ఆ బదిలీల సమయంలో వారు మాట్లాడాలి అని ఉండాల్సింది అనేవరకు ఓకే కానీ...ఎందుకు మాట్లాడలేదు అనడం సరికాదు. ఎందుకంటే, ఏ అంశం మీదైనా స్పందించడం, స్పందించకపోవడం వారి ఇష్టం`` అని వెల్లడించారు.
రిటైర్డ్ అధికారులే కాకుండా పదవిలో ఉన్న సమయంలోనూ ఐఏఎస్లు గవర్నర్ వద్దకు వెళ్లవచ్చన్నారు. ``రాజ్యాంగ రీత్యా గవర్నర్ ప్రభుత్వాధినేత. ఆయన వద్దకు మర్యాదపూర్వకంగా వెళ్లవచ్చు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లవచ్చు. అయితే, ముఖ్యమంత్రికి జవాబుదారిగా అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సి ఉండటం సంప్రదాయం. అయితే, ఐఏఎస్లు పదవి వదిలి విశ్రాంతిలో ఉన్నపుడు సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు వినాలని అనడం సరికాదు. తాజా ఉదంతంలో సీఎంగా విరుచుకుపడటం వల్ల చంద్రబాబు గౌరవం తక్కుతుంది కానీ విశ్రాంత ఐఏఎస్ అధికారులకు తగ్గదు.`` అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అధికారాలన్నింటిని ఆస్వాదించి దిగిపోగానే విమర్శలు కొందరు ఐఏఎస్లు విమర్శలు చేయడం సరికాదని ఈ సందర్భంగా నాగేశ్వర్ అన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు తమ సర్వీసు ముగిసిన అనంతరం పొలిటీషియన్లుగా కూడా మారుతున్నారని వివరించారు.
ఎన్నికల కమిషన్తో చంద్రబాబు పోరాటం అయితే, ఐఏఎస్లపై వ్యాఖ్యలు చేయడం సరికాదని నాగేశ్వర్ అన్నారు. ``చంద్రబాబు చెప్తున్నట్లు సదరు అధికారులను కేంద్రం ప్రభుత్వం మార్చలేదు. సాంకేతికంగా ఎన్నికల కమిషన్ చేసింది. ఎన్నికల కమిషన్ పట్ల సహా ఇతర వ్యవస్థలపై పోరాటం చేయవచ్చు.ద్వివేది, ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఇతరులపై వ్యక్తిగతంగా పంచాయతీ పెట్టుకోవడం ఎందుకు? స్థూలంగా రిటైర్డ్ ఐఏఎస్లు రాజ్యాంగబద్దమైన సంస్థల నిర్వీర్యంపై మాట్లాడాలి అనడం వరకు సరైనదేమో కానీ...ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించడం సరికాదు.`` అని తేల్చిచెప్పారు.