జగన్ కోసం బారులు తీరుతున్న పులివెందుల ప్రజలు.. అసలేం జరిగిందంటే?
పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనూహ్యమైన స్పందన లభించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల ఓటమి తర్వాత జగన్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిందనే ప్రచారాన్ని ఈ జనసందోహం దాదాపుగా తోసిపుచ్చుతోంది. పులివెందులలో జగన్ అడుగడుగునా ఎదుర్కొన్న అభిమానం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీ పునరుత్తేజానికి బలమైన సంకేతాన్ని పంపుతోంది.
జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్'కు, అలాగే వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఆయనను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ముఖ్యంగా, ఎన్నికల తర్వాత టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితులు, కార్యకర్తల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ జగన్ వారికి 'నేనున్నానని... మీకేం కాదని' భరోసా ఇచ్చారు. సమస్యలు విన్న వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం, కొన్ని విషయాలపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో చర్చించి మార్గం చూపడం వంటి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి.
ఈ పర్యటనలో భాగంగా జగన్ బ్రహ్మణపల్లిలోని అరటి తోటలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కూటమి పాలనలో అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, కోల్డ్ స్టోరేజీలను మూసివేయడం వంటి అంశాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతుల కోసం రైళ్లు నడిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల నుంచి ఎదురైన ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు వ్యవసాయ విధానాలపై ఆయన చేసిన విమర్శలు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి.
ఎన్నికల్లో ఎదురైన పరాజయం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి అంశాల మధ్య కూడా జగన్కు ఆయన సొంత నియోజకవర్గంలో లభించిన ఈ ఆదరణ, ఆయన రాజకీయ భవిష్యత్తుపై అంచనాలను మారుస్తోంది. జై జగన్ నినాదాలతో పులివెందుల మార్మోగడం, ఆయన పట్ల ప్రజల్లో అభిమానం సజీవంగా ఉందని, ఇంకా పెరుగుతోందని వైఎస్సార్సీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ జనసందోహం వైఎస్సార్సీపీకి ఓటమి తర్వాత ఒక గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు.