మహానాడులో ఏఐ మాయాజాలం.. అదరహో అనేలా ఎన్టీఆర్ స్పీచ్!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలను ఏఐ ఎన్టీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంగరంగ వైభంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నిరాజం ఇచ్చిన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఏపీ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలిపారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో పాటు దేశప్రధాని నరేంద్ర మోదీపై కూడా ప్రశంసలు కురిపించారు. కొత్త జగతికి అపూర్వ ప్రగతికి టీడీపీ బాటలు వేసిందన్నారు. `హైదరాబాద్, సికింద్రాబాద్ లకు ట్యాంక్ బండ్ తో నేను సాంస్కృతిక వారధి కడితే.. ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు, ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టినవాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏనాడైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది` అని ఏపీ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
`యువ గణానికి ప్రాధాన్యం ఇచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలలు నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు ఆచరిస్తూ పార్టీ కార్యకర్తకైనా, సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నె తీస్తున్న లోకేష్ ను చూస్తుంటే ముచ్చటేస్తుంది.. భళా మనవడా.. భళా..` అంటూ ఎన్టీఆర్ ప్రశంసించారు. అలాగే టీడీపీ తీసుకొచ్చిన పథకాల గురించి, తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. మొత్తంగా అదరహో అనేలా ఉన్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ గా మారింది.