ఏపీలో మారనున్న రేషన్ కార్డుల ముఖచిత్రం.. జగన్ బొమ్మల కార్డులకు కూటమి చెక్!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో తమ సర్కార్ పంపిణీ చేసిన రేషన్ కార్డులలో వైఎస్సార్, జగన్ ఫోటోలతో రేషన్ కార్డులను ముద్రించారు. పార్టీ రంగులతో రేషన్ కార్డులు ఉండటంపై గతంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీలో రేషన్ కార్డుల ముఖచిత్రం మారనుందని తెలుస్తోంది. పాత రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
 
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కొత్త రేషన్ కార్డుల రూపకల్పన విషయంలో ప్రస్తుతం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అధికారులు ఇందుకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ కార్డు నినాదంతో కేంద్రం స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ విధానాన్ని సైతం పరిశీలిస్తున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తే దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని సమాచారం అందుతోంది. స్మార్ట్‌ రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భోగట్టా. 2019 జూన్‌ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులు ఉన్నాయి.
 
ఈ కార్డులలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం గుర్తించిన కార్డులు 89 లక్షలు మాత్రమే కాగా ఈ కార్డులకు మాత్రమే కేంద్రం నుంచి రాయితీ లభిస్తోంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పెళ్లైన జంటలకు కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. కొత్త కార్డులు జారీ చేసినా ప్రభుత్వంపై భారం పడకుండా అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. కొత్త రేషన్ కార్డుల దిశగా అడుగులు పడుతుండటం ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. ఏపీ ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: